బుదవారం, అక్టోబర్ 28, 2009, 10:17 [IST]
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాణాంతక వ్యాధులు విజృంభిస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. విషజ్వరాల బారిన పడి బాధపడుతున్న వాిరని పరామర్శించేందుకు ఆయన బుధవారం ఉదయం కరీంనగర్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. అందుకు ముందు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విషజ్వరాల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
డెంగ్యూ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేరుస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అందుకు సాంకేతిక కారణాలను చూపుతూ మాట మారుస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, వ్యాధులతో బాధపడుతున్నవారిని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోని 110 మంది మరణించారని, అనధికారికంగా ఇంకా ఎక్కువ మందే మరణించి ఉంటారని ఆయన అన్నారు. ఇప్పటికై ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.