శనివారం, నవంబర్ 7, 2009, 12:51 [IST]
బెంగుళూరు: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తనయుడు, కడప ఎంపి వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం బెంగుళూరు నుంచి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఆయనతో పాటు తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలాలు కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది.
శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైయస్ జగన్కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. వీరి సమావేశంలో ముఖ్యంగా పులివెందుల టిక్కెట్, తర్వాత కేంద్రంలోగాని, రాష్ట్రంలోగాని జగన్కు తగిన ప్రాధాన్యపై చర్చలు జరిగే అవకాశమున్నట్లు తెలియవచ్చింది.
జగన్ కు కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇవ్వడానికి సోనియా గాంధీ సిద్ధమైనా, ఆ పదవి తీసుకోడానికి జగన్ తటపటాయిస్తున్నారు. కేంద్రంలో కేబినెట్ ర్యాంక్ పదవి కావాలని ఆయన వర్గం పట్టుబడుతోంది. లేదంటే పులివెందుల అసెంబ్లీ టికెట్ తీసుకుని పిసిసి అధ్యక్ష పదవి తీసుకోవాలని వైయస్ జగన్ ఆశిస్తున్నారు. ఈ ఆప్షన్లపై సోనియా గాంధీ నేడు ఆయనకు ఏదో ఒకటి తేల్చుకోమని చెప్పే అవకాశముంది.