శుక్రవారం, ఆగస్ట్ 21, 2009, 17:51 [IST]
హైదరాబాద్: చిరంజీవి ఇప్పుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.రాష్ట్ర రాజకీయాల్లో సునామీ సృష్టిస్తుందని భావిం చిన ప్రజారాజ్యం, చివరకు నిరాశాపూరిత ఫలితా లతో చతికిలపడిన వైనం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సహా, గెలిచిన ఎమ్మెల్యేలందరిలోనూ భవిష్యత్తుపై పునరాలోచనలో పడేసింది. పెద్ద పార్టీగా అవతరిస్తుందనుకున్న ఆశలన్నీ ఆవిరయి, చివరకు చిన్నపార్టీగా స్థిరపడటం, అగ్రనేతలంతా పార్టీ నుంచి దూరమవడం ఆందోళన మరింత పెంచింది. ఆ క్రమంలో మొదలైన శాసనసభ సమావేశాలు పీఆర్పీని కాంగ్రెస్కు దగ్గర చేశాయి. కాపు మంత్రు లయిన వట్టి వసంతకుమార్, బొత్స సత్యనారాయణ వంటి ప్రముఖులు ముఖ్యమంత్రి, ఆయనను నడిపించే మరో కీలకశక్తి ప్రోత్సాహంతో చిరంజీవి, ఆయనను నడిపించే ‘ఆత్మబంధువు’తో మంతనాలు జరిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించ వద్దని, ఒకవేళ ప్రతిపక్షంగాఎన్ని ఆందోళన కార్యక్రమాలు చేసినా అది అంతిమంగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకే లాభం కలుగుతుందని నచ్చచెప్పి, చిరంజీవిని సానుకూలంగా తమ వైపు తిప్పుకోవడంలో విజయం సాధించారు. అంత కంటే ముందే.. పీఆర్పీ ఎమ్మెల్యేలు చాలామంది గెలిచిన వెంటనే వైఎస్ను కలిసి, తాము కూడా కాంగ్రెస్లో చేరతా మని చెప్పడం, సమయం వచ్చినప్పుడు చూద్దామని ఆయన భరోసా ఇవ్వడంతో పీఆర్పీ మానసికంగా కాంగ్రెస్కు చాలారోజుల క్రితమే దగ్గరయినట్టయింది.
అయితే, సరిగ్గా ఇదే సమయంలో చిరంజీవిని సినీ పరిశ్రమ నుంచి వెన్నంటి ఉన్న ఆయన ఆత్మబంధువు వద్ద వైఎస్ సన్నిహితులు మరో ప్రతిపాదన పెట్టారు. వచ్చే ఏడాది జరిగే రాజ్యసభ ఎన్నికల్లో చిరంజీవిని రాజ్యసభకు పంపించి, ఆయనకు కేంద్రమంత్రి పదవి..ఆయనతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో క్యాబినెట్ పదవులూ ఇస్తామని కాంగ్రెస్ దూతలు ప్రతిపాదించగా అందుకు సదరు ఆత్మబంధువు అంగీకరించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తమకున్న బలం, వాస్తవ పరిస్థితి అంచనా వేసుకుంటే కాంగ్రెస్ ప్రభు త్వంపై ఏ స్థాయిలోనూ ధీటుగా పోరాడే శక్తి, వనరులు, యంత్రాంగంలేని వైనం కూడా పీఆర్పీ..కాంగ్రెస్ కు స్నేహ హస్తం అందించడతానికి మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉన్నం దున, మంత్రి పదవుల సాయంతో రెండు మూడేళ్లలో పార్టీని పటిష్టం చేసుకోవచ్చని పీఆర్పీని తెరవెనుక ఉండి నడిపిస్తోన్న ఆత్మబంధువు భావించినందునే పీఆర్పీ- కాంగ్రెస్ మైత్రీ బంధం వికసించనున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగానికి సదరు ఆత్మబంధువే దర్శకత్వం వహిస్తున్నారు.