Oneindia Mobile
Super Song Lyrics Directory- Get here!
జగన్ కే రాహుల్ ఓటు?
గురువరం, సెప్టెంబర్ 10, 2009, 16:38 [IST]



Rahul Gandhi
ఎఐసిసి రాహుల్ గాంధీ తమిళనాడు రాజధాని చెన్నైలో చేసిన వ్యాఖ్యలకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై వర్గీయులు సంబరపడి పోతున్నారు. ముఖ్యమంత్రి పీఠం జగన్ దక్కడం ఖాయమని వారు ఒక నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవికి జగన్ అన్ని విధాలా అర్హుడని రాహుల్ గాంధీ అన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. జగన్ ను వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా మాత్రమే చూడకూడదని, ఆయనను ఆయనను విడిగా, ఒక ప్రజాప్రతినిధిగా చూడాలని, ప్రజా ప్రతినిధిగా జగన్ సమర్ధుడని రాహుల్ అన్నారు. జగన్ చాలా విజయాలు సాధించారని కూడా ఆయన ప్రశంసించారు. దీంతో జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి రాహుల్ గాంధీ పచ్చజెండా ఊపినట్లు భావిస్తున్నారు. యువ నాయకత్వం రావాలని పదే పదే రాహుల్ గాంధీ చెబుతున్న నేపథ్యంలో యువకుడైన జగన్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపిక తన పరిధిలో లేదని, ఆ విషయాన్ని పార్టీ అధిష్టానవర్గం చూసుకుంటుందని రాహుల్ అన్నారు. ఈ మాటలు కేవలం సాంకేతికపరమైనవేనని జగన్ వర్గీయులు అంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడానికి అన్ని విధాలా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వారంటున్నారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్టీ పార్లమెంటు సభ్యులు ప్రణబ్ ముఖర్జీని కూడా కలిసి తమ అభిప్రాయాన్ని వినిపించారు. కెవిపి రామచందర్ రావు సోనియాను, మన్మోహన్ ను, ప్రణబ్ ముఖర్జీని కలిసి జగన్ కు అనుకూలంగా తన వాదన వినిపించారు. తాజాగా ఆయన సోనియా రాజకీ సలహాదారు అహ్మద్ పటేల్ ను కూడా కలుస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ నేతగా జగన్ ఎంపిక కావడమే మిగిలి ఉందనే ప్రచారం కూడా సాగుతోంది.

ఇదే సమయంలో నీల్సన్ - మార్గ్ సర్వేను ఒక తెలుగు టీవీ చానెల్ వెల్లడించింది. మంత్రులు, కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులే కాదు ప్రజలు కూడా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు ఆ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని 78 శాతం మంది జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు ఆ సర్వే తన ఫలితాన్ని వెల్లడించింది. ఈ నెల 10, 11 తేదీల్లో కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుగుతుందని వారు ఆశించారు. అయితే ఈ రోజు కాకపోయినా రేపైనా సిఎల్సీ సమావేశం జరుగుతుందని వారు ఆశిస్తున్నారు. అందుకే కాంగ్రెసు శాసనసభ్యులందరినీ హైదరాబాదు రావాలని జిల్లా ఇంచార్జీ మంత్రులు సూచించినట్లు చెబుతున్నారు. రేపో, మాపో ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ వస్తారని, ఆయన సమక్షంలో సిఎల్పీ సమావేశం జరుగుతుందని, ఇందులో లాంఛనంగా జగన్ ను తమ నేతగా ఎన్నుకుంటారని భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో అధిష్ఠాన వర్గం మాత్రం సూచన ప్రాయంగా కూడా తన అభిమతాన్ని వెల్లడించడం లేదు. అందరూ చెబుతున్న అభిప్రాయాలను మాత్రమే అధిష్ఠాన వర్గం ప్రతినిధులు వింటున్నారు. వారి నుంచి ప్రతిస్పందన మాత్రం రావడం లేదు. కాంగ్రెసులో ఏమైనా జరగవచ్చుననేది అందరికీ తెలిసిన విషయమే.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.