Oneindia Mobile
New Videos here on ur Mozilla -Get them!
జగన్ కు'చిరు' చెక్
శుక్రవారం, సెప్టెంబర్ 25, 2009, 11:53 [IST]



Chiranjeevi
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ కు కాంగ్రెసు అధిష్ఠాన వర్గం ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తోంది. జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి లేదా జగన్ వేరు కుంపటి పెడితే తట్టుకోవడానికి తగిన ఏర్పాట్లలో కాంగ్రెసు పార్టీ నాయకత్వం మునిగినట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను సాకుగా చూపి నాయకత్వ మార్పును వాయిదా వేస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అందుకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ బాధ్యతను ముఖ్యమంత్రి కె. రోశయ్యకు పార్టీ అధిష్ఠాన వర్గం అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే చిరంజీవితో తిరుపతిలో రోశయ్య సమావేశమైనట్లు భావిస్తున్నారు. చిరంజీవిని పార్టీలోకి అహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసే ఆలోచనలపైనే దృష్టి పెడుతున్నట్లు చెబుతున్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి జీవించిన ఉన్న కాలంలో పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలని ప్రతిపాదించిన ప్రజారాజ్యం పార్టీ నేతలు ఇప్పుడు వైయస్ జగన్ కు విధేయతను ప్రకటిస్తున్నారు. ఆ విధేయత ప్రజారాజ్యం పార్టీ ఉనికికి ప్రమాదకరంగా పరిణమించింది. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ)ని చీల్చడం వల్ల తగ్గే మెజారిటీని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులతో భర్తీ చేసుకోవాలని జగన్ వర్గం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవి పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి నాయకత్వాన్ని చేపట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. జగన్ కు ధీటైన ప్రజాదరణ గల నాయకుడిగా చిరంజీవి నిలుస్తారని కాంగ్రెసు అధిష్ఠాన వర్గం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెసు అధిష్ఠాన వర్గం సూచన మేరకే రోశయ్య చిరంజీవితో మంతనాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే చిరంజీవి రోశయ్య నాయకత్వ సమర్థతను ప్రశంసించారని అంటున్నారు. పార్టీలోని కొంత మంది శాసనసభ్యులు జగన్ వైపు వెళ్లిపోయినా నష్టం జరగకుండా కాంగ్రెసుకు జబ్బ పుష్టి కల్పించాలనేది చిరంజీవి వ్యూహమని అంటున్నారు.

ఇప్పటి వరకు జగిన రాష్ట్ర పార్టీ పరిణామాలపై సోనియా గాంధీ రాష్ట్ర పార్టీ వ్యవహారాలను చూసిన అగ్రనేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఒక కుటుంబ ప్రాబల్యం, ఒక సామాజిక ప్రాబల్యం తమనే సవాల్ చేసే విధంగా మారే దాకా వేచి చూడడం ఆమెకు తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లు చెబుతున్నారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని వస్తున్న ఒత్తిడి తమకే సవాల్ గా మారడం ఆమెను కలవర పెడుతున్నట్లు చెబుతున్నారు. దీంతో చిరంజీవి వైపు ఆమె దృష్టి సారించినట్లు చెబుతున్నారు. చిరంజీవి కూడా అందుకు వ్యతిరేకంగా ఏమీ లేరని, అయితే పరిస్థితిని అంచనా వేసుకుని నిర్ణయం తీసుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. సోనియా గాంధీ జగన్, వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావు కదలికలపై నిఘా వేసినట్లు చెబుతున్నారు. కాగా, ముఖ్యమంత్రి కార్యాలయానికి అందుతున్న ఇంటలిజెన్స్ నివేదికలు జగన్ వర్గానికి వెంటవెంటనే లీక్ కావడం కూడా తీవ్ర సమస్యగా మారింది. దీంతో అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదికలు సమర్పించడానికి కూడా భయపడుతున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, కాంగ్రెస్ అధిష్ఠానానికి జగన్ వ్యవహారం సవాల్ గానే మారిందని చెప్పాలి.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.