సోమవారం, అక్టోబర్ 26, 2009, 8:53 [IST]
హైదరాబాద్: ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రోశయ్యతో పరోక్ష యుద్ధం చేసి ఓడిపోయిన జగన్ ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తో తలపడాల్సి ఉంది. వైయస్ అభీష్టానికి వ్యతిరేకంగా ఆనాడు డిఎస్ ను సోనియాగాంధీ పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. డిఎస్ తనకు ఎప్పటికైనా ప్రమాదమేనని గ్రహించిన వైఎస్ ఆయనతో మంచిగా ఉంటూనే, గత ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి ఎన్నిక కాకుండా వెనుక నుంచి చక్రం తిప్పారన్న విమర్శలు ఉన్నాయి. డిఎస్ గెలిచి ఉంటే ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉండేవి. వైఎస్ మరణం తర్వాత రోశయ్య బదులు డిఎస్ ముఖ్యమంత్రి అయి ఉండేవారు.
ఆనాడు వైఎస్ ఉపయోగించిన టెక్నిక్ ను మరో రకంగా డిఎస్ జగన్ పై ప్రయోగించనున్నారు. రాజశేఖరరెడ్డి మరణంతో ఖాళీగా ఉన్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక త్వరలో జరుగనుంది. అక్కడి నుంచి పోటీచేసి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. జగన్ అసెంబ్లీలో అడుగుపెడితే కాంగ్రెస్ పార్టీలో 90 శాతం ఆయన వైపే ఉంటుంది. అప్పుడు డిఎస్ కు ఏ మాత్రం విలువ ఉండదు. అందువల్ల జగన్ కు టికెట్ ఇస్తే వచ్చే నష్టాల గురించి డిఎస్ సోనియాగాంధీకి వివరించనున్నట్టు తెలిసింది. నేడు డిఎస్ ఢిల్ల్లీ వెళ్ళారు. నేడో రేపో ఆయన సోనియా గాంధీని కలిసి జగన్ కు పులివెందుల టికెట్ ఇవ్వవద్దని వేడుకోనున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి అయిన తర్వాత రోశయ్య తొలిసారిగా నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. పదవి ఇచ్చిన కిక్కుతో ఆయన అంత పెద్ద వయసులోనూ యువకుడిగా కన్పిస్తున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్ధితులను ఆయన సోనియాగాంధీకి వివరించనున్నారు. సిఎల్పీ, అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ఎలా నిర్వహించాలో సోనియా గాంధీ నుంచి సలహాలు పొందనున్నారు. రోశయ్య మంత్రివర్గాన్ని తనకు తగిన రీతిలో ఏర్పాటు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ పొందుతారన్న మాట వినిపిస్తున్నది. అయితే ఇప్పుడే తన స్వంత మంత్రివర్గ జాబితా తీసుకు వెళ్తారా లేదా అనేది తెలియ రాలేదు. అదే సమయంలో తన మంత్రివర్గంలో ఉంటూనే ధిక్కార వైఖరి ప్రదర్శిస్తున్న కొందరు మంత్రుల విషయంలో ఆయన తాడో పేడో తేల్చుకోనున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి ఈ కార్తీక సోమవారం జగన్ వర్గానికి మరో పెద్ద పరీక్షగా నిలువనుంది.